ధరణికి బదులుగా ‘భూ భారతి’.. సీఎం రేవంత్ కొత్త పోర్టల్ ప్రారంభం

తెలంగాణ భూ వ్యవస్థలో ఓ భారీ మార్పుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్నో వివాదాలకు దారి తీసిన ధరణి పోర్టల్‌కు బదులుగా, రైతులకు సులభంగా అర్థమయ్యేలా “భూభారతి పోర్టల్” ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం, భవిష్యత్ దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని తెలిపారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ.. ఇలా నాలుగు భాషల్లో ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారిగా కోటి మంది లాగిన్ అయినా సర్వర్ క్రాష్ కాకుండా టెక్నాలజీని సిద్ధం చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సేవలు ప్రారంభం కానున్నాయి.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తీసుకొచ్చిన ఈ కొత్త పోర్టల్ పై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మండలాల్లో స్పెషల్ సదస్సులు నిర్వహించనున్నారు. జూన్ 1లోపు మూడు మండలాల్లో భూ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ప్రభుత్వ మంత్రులు హామీ ఇచ్చారు.

సైబర్ భద్రత దృష్ట్యా ఫైర్ వాల్‌లు, హ్యాకింగ్‌లను అడ్డుకునే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పోర్టల్ వాడకంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

“ఇది ప్రజల భూములను రక్షించేందుకు రూపొందించిన చట్టం. ఇతర రాష్ట్రాల్లోని వ్యవస్థలను విశ్లేషించి, భూ భారతి చట్టాన్ని రూపొందించాం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

భూములపై అనేక అనుమానాలు, ల్యాండ్ డిస్ప్యూట్లకు ఇక ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా భూ భారతి చర్యలు సాగనున్నాయి.

Leave a Reply