టాలీవుడ్ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన వ్యక్తి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసానిపై ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.9 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ, టీడీపీ నేతలకు తన విన్నపాన్ని అందజేశాడు.
కె. సత్యనారాయణ శెట్టి అనే వ్యక్తి టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో తన సమస్యను వివరించాడు. పోసాని కృష్ణమురళి, మహేశ్ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.9 లక్షలు తీసుకున్నారని, కానీ తనను మోసం చేశారని పేర్కొన్నాడు. ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఎటువంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
డబ్బులు కోల్పోయిన తర్వాత తన కుటుంబం తనను ఇంటికి రానివ్వడం లేదని, ప్రస్తుతం గుంటూరులో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నానని వాపోయాడు. తన పరిస్థితి దయనీయంగా మారిందని, తనకు రావాల్సిన డబ్బులను పోసాని నుంచి ఇప్పించి న్యాయం చేయాలని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశాడు. ఆయన విన్నపాన్ని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ స్వీకరించారు.
ఇటీవల చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఫిబ్రవరి 26న రైల్వే కోడూరు పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి వరుస కేసులతో పోసాని కష్టాలు పెరిగాయి. ఒక్క రోజుకు ఒక కోర్టు, ఒక్క పూటకో పోలీస్ స్టేషన్ అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఎట్టకేలకు ఆదోని, విజయవాడ, రాజంపేట, నరసరావుపేట కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో కర్నూలు జైలులో ఉన్న పోసాని విడుదలకు లైన్ క్లియర్ అయినట్టయినా, తాజా పరిణామాలతో మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి.
తాజాగా సీఐడీ పోసానిపై పీటీ వారెంట్ జారీ చేయడంతో ఆయన విడుదలకు మరోసారి బ్రేక్ పడింది. తనపై పెండింగ్ కేసుల నుంచి బయటపడే ప్రయత్నంలో ఉన్న పోసాని కృష్ణమురళికి, ఈ ఉద్యోగ కుంభకోణ ఆరోపణ మరింత భారంగా మారనుందా? అధికారికంగా ఈ కేసుపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.