Subbayya Gari Hotel: సుబ్బయ్య హోటల్‌లో షాకింగ్ నిజాలు.. భోజనం కాదు.. భయం పుట్టించే దృశ్యాలు!

సుబ్బయ్య గారి హోటల్ పేరు తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కాకినాడలో ప్రారంభమైన ఈ హోటల్, ఫుల్ మీల్స్ కోసం పేరొందింది. నోరూరించే రుచితో భోజన ప్రియుల మనసును గెలుచుకున్న ఈ హోటల్ విస్తరిస్తూ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ తదితర నగరాల్లో బ్రాంచులు ప్రారంభించింది. అయితే తాజాగా హైదరాబాద్ కొండాపూర్ బ్రాంచ్‌లో టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

ఆహార భద్రతా అధికారులు తనికీ చేయగా హోటల్‌లో పరిశుభ్రత లేకపోవడంతో పాటు అనేక నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. కిచెన్ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండడంతో పాటు డ్రైనేజీ నీరు పొంగుతున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు, స్టోర్‌లో నిల్వ ఉంచిన అశుద్ధమైన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సిన హోటల్‌లో, స్టాఫ్ గ్లోవ్స్ లేకుండా పని చేయడం, హోటల్ యాజమాన్యం లైసెన్స్ కూడా చూపించకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి.

వంటగది పరిస్థితి మరీ భయంకరంగా ఉండటం కస్టమర్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. గోడలు నూనెతో నిండిపోవడం, స్టోర్ రూమ్ అపరిశుభ్రంగా ఉండటం, ఫ్లోరింగ్ విరిగిపోవడం వంటి దృశ్యాలు హోటల్ నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయి. నిత్యం వేలాదిమంది కస్టమర్లు భోజనం చేసే హోటల్ ఇంత నిర్లక్ష్యంగా నిర్వహించబడుతుండటం గమనిస్తే, ఇతర బ్రాంచుల్లో పరిస్థితి ఏమిటనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, హోటల్ భద్రతపై చర్చ నడుస్తోంది. ఇకపై హోటల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, తన పేరును తిరిగి ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply