బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ టీవీ యాంకర్ శ్యామలపై విచారణ పూర్తయ్యింది. సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు హాజరైన ఆమెను మూడు గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఆమెకు సంబంధించిన కీలక ప్రశ్నలు వేస్తూ, బెట్టింగ్ యాప్ల ప్రచారంలో ఆమె పాత్రను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన శ్యామల, బెట్టింగ్ యాప్ల ప్రచారం చేయడం తప్పే అని అంగీకరించింది. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని, ఇకపై ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటానని చెప్పింది.
ఈ కేసు సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో మొదలైంది. ఆయన శ్యామలతో పాటు మరికొందరు సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్యామల ‘ఆంధ్రా 365’ అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ, యూత్ను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. అయితే, ఆమె మొదట్లో స్పందించలేదు. కానీ కేసు తీవ్రమవుతుండటంతో తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టులో విచారణ సందర్భంగా శ్యామల తరఫు న్యాయవాది, ఆమె కేవలం యాప్ను ప్రమోట్ చేసింది కానీ, దానిలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని వాదించారు. ఈ వాదనను పరిశీలించిన హైకోర్టు, పోలీసులు ఆమెను అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. అయితే, విచారణకు సహకరించాలని సూచించింది. దీంతో సోమవారం ఉదయం ఆమె పోలీస్ స్టేషన్కు హాజరైంది.
యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ అంశంపై స్పందిస్తూ, కోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడలేనన్నారు.
పోలీసులు విచారణకు సహకరిస్తానని, ఇకపై వాటి ప్రమోషన్స్ చేయబోమని స్పష్టం చేశారు.#Syamala pic.twitter.com/mW0UkdR7B3
— Gulte (@GulteOfficial) March 24, 2025
విచారణలో పోలీసులు శ్యామలను బెట్టింగ్ యాప్ను ఎంతకాలంగా ప్రమోట్ చేస్తున్నదీ, ఈ ప్రచారం ద్వారా ఎన్ని డబ్బులు సంపాదించింది, యాప్ యజమానులతో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలున్నాయా అనే విషయాలను ప్రశ్నించారు. దీనిపై ఆమె, తాను కేవలం యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానని, ఇతర వివరాలు తనకు తెలియవని సమాధానమిచ్చింది. తాను ఎవరినీ బెట్టింగ్కు ప్రేరేపించలేదని, తన ప్రమోషన్ వల్ల ఎవరికైనా నష్టం జరిగుంటే క్షమించాలంటూ చెప్పినట్లు సమాచారం.
ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ‘ఆంధ్రా 365’ యాప్ వల్ల ఎంతమంది మోసపోయారనే దానిపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఇకపై మరికొందరు సెలబ్రిటీలను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు కారణంగా శ్యామల కెరీర్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. టెలివిజన్ షోలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లకు ఆమెను పిలిచే అవకాశాలు తగ్గిపోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా యువతను నాశనం చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైకోర్టు తుదితీర్పు వచ్చే వరకు శ్యామల బెయిల్పై ఉంటారు. అయితే, కేసు మరింత ముదిరితే నిందితుల జాబితాలో ఇతర సెలబ్రిటీలు కూడా చేరే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ కేసులో శ్యామల క్లీన్చిట్ పొందుతుందా? లేక మరింత చిక్కుల్లో పడతారా? అనేది చూడాలి.