ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ పార్టీకి ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదని, విదేశీ మద్యం కూడా అనుమతి లేకుండానే వాడారని పోలీసులు నమోదు చేసిన FIRలో స్పష్టం చేశారు. అంతేకాదు, మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి సేవించినట్టు డ్రగ్ టెస్ట్లో తేలిందని పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రకారం, రాత్రి ఒంటిగంట సమయంలో త్రిపుర రిసార్ట్లో జోరుగా డీజే పాటలు, మద్యం సేవిస్తూ హంగామా జరుగుతుందంటూ ఫిర్యాదు వచ్చింది. వెంటనే మహిళా ఎస్ఐ అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టింది. దాదాపు పది మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డాన్స్లు చేస్తూ సందడి చేస్తున్నారని గుర్తించారు. కొంత మంది మద్యం మత్తులో ఉన్నట్లు కనబడిందని పోలీసులు పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై దాడిచేసిన చేవెళ్ల పోలీసులు. చట్టాలు పాటించకుండా ఎలాపడితేఅలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుంది. ఎంతటిప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారిపట్ల కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడం. #TelanganaPolice pic.twitter.com/s4IbSzhIkM
— Telangana Police (@TelanganaCOPs) June 11, 2025
రిసార్ట్ మేనేజర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతుందని తేలిందని, కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. తనిఖీల్లో భారీగా విదేశీ మద్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
డ్రగ్ టెస్ట్లో మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్టు తేలింది. అతన్ని అరెస్ట్ చేసి విచారించారని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగ్లీపై, ఆమె సోదరుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు. అలాగే రిసార్ట్ మేనేజ్మెంట్పై, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్పై కూడా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇప్పుడు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సెలబ్రిటీల బర్త్డే పార్టీల్లో సరైన నియమ నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.