విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలి జరిగిన ప్రమాదంలో పలువురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఘటన తీవ్రతను అధికారులు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
గాలి వాన బీభత్సానికి, సింహాచలం ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోవటం దురదృష్టకరం. రాత్రి 2.30 గంటలకు ఘటన జరిగిన వెంటనే, సహాయక చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం రాష్ట్ర… pic.twitter.com/iNUNezCYlM
— Telugu Desam Party (@JaiTDP) April 30, 2025
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టికెట్ల కోసం నిలబడిన భక్తులపై గోడ కూలిన విషయమై తీవ్రంగా స్పందించిన ఆయన, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఊహించని ప్రమాదం జరిగిందని పేర్కొన్న ఆయన, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు.
ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరు చనిపోయిన కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు మూడు మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, మంత్రి అనిత, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉండి, పూర్తి స్థాయిలో సహాయం అందిస్తుందన్న భరోసాను సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు.