దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గేట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) ఫలితాలను ఐఐటీ రూర్కీ మార్చి 19న ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 8.37 లక్షల మంది దరఖాస్తు చేయగా, 80 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. స్కోర్ కార్డులను మార్చి 28 నుంచి మే 31 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాల్లో తెలుగు యువకుడు అసాధారణ ప్రతిభ కనబరిచాడు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన డాక్టర్ సాదినేని నిఖిల్ చౌదరి గేట్ 2025లో అద్భుత విజయాన్ని సాధించాడు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 100 మార్కులకు గాను 96.33 మార్కులతో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు. ఇది అతని అంకితభావానికి, కృషికి నిదర్శనం. గతంలో నీట్ పరీక్షలో 57వ ర్యాంకు సాధించి ఆకట్టుకున్న నిఖిల్ ప్రస్తుతం నోయిడాలోని ఎక్స్పర్ట్డాక్స్ అనే సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
నిఖిల్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే గేట్ కోసం సమర్థవంతంగా ప్రిపరేషన్ చేసుకున్నాడు. ప్రతిరోజు ఆఫీస్ పనుల అనంతరం 4-5 గంటల పాటు చదువుకునేవాడు. సెలవు రోజుల్లో ప్రణాళికాబద్ధంగా 7-8 గంటల పాటు ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. అతని కష్టం, పట్టుదల ఫలితంగా గేట్ 2025లో అగ్రస్థానాన్ని సాధించాడు.
నిఖిల్ తండ్రి సాదినేని శ్రీనివాసులు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. తల్లి బిందు మాధవి సాఫ్ట్వేర్ ఇంజినీర్. విద్యావంతులైన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నిఖిల్ చిన్నప్పటి నుంచే చదువుల్లో ప్రతిభ చూపించేవాడు. హైదరాబాదులో టెన్త్, ఇంటర్ పూర్తి చేసిన అతను పదో తరగతిలో 9.8 సీజీపీఏ, ఇంటర్లో 98.6% మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.
2017లో నీట్ పరీక్షలో 57వ ర్యాంకు, ఎయిమ్స్ ఎంట్రన్స్లో 22వ ర్యాంకు సాధించిన నిఖిల్, ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2024లో ఐఐటీ మద్రాస్లో డేటా సైన్స్లో ఆన్లైన్ డిగ్రీ కోర్సును కూడా పూర్తిచేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంటెక్ చేయాలన్న లక్ష్యంతో గేట్ పరీక్ష రాయగా, అద్భుత ర్యాంక్ సాధించి తన ప్రతిభను మరోసారి రుజువు చేశాడు.
నిఖిల్ విజయయాత్ర యువతకు స్ఫూర్తిదాయకం. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మరోసారి నిరూపించాడు.