ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ ఫైర్.. మీ డిమాండ్లు నెరవేర్చాలంటే ఏ పథకం ఆపాలి..?

ఉద్యోగ సంఘాల సమ్మె ప్రకటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో ఉద్యోగుల డిమాండ్లు, సమ్మెలు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు.

రాష్ట్రంలో ఒక్క పైసా అప్పు కూడా తెచ్చే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. “బ్యాంకుల వద్దకు వెళ్లినా.. దొంగను చూసినట్టు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తే.. ఏ సంక్షేమ పథకాన్ని ఆపి మీ డిమాండ్లు నెరవేర్చాలో మీరే చెప్పండి!” అని సీఎం విరుచుకుపడ్డారు.

ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్, “గతంలో లేని విధంగా మొదటి తేదీకే జీతాలు ఇస్తున్నాం. అయినా సమరం చేస్తారా?” అని ఉద్యోగ సంఘాల నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా ప్రతినిధులతో పాటు ఉద్యోగులూ ప్రభుత్వానికి భాగస్వాములే అని, సేవకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కొంతమంది రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, వాటిలో ఉద్యోగ సంఘాలు భాగమవడం దురదృష్టకరమన్నారు. ఈ సంక్షోభ సమయంలో నిరసనలు చేస్తే, ప్రభుత్వం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

“ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సంయమనం అవసరం. రాష్ట్రాన్ని కుటుంబంగా భావించి, ప్రజా సంక్షేమాన్ని ముందే ఉంచాలి. ఇలాంటి సమయంలో సహకారం అందించడం ఉద్యోగుల బాధ్యత” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Leave a Reply