తెలంగాణ యువత రక్తంలోనే ఉద్యమం ఉన్నదని, అలాంటి యువత డ్రగ్స్ బారిన పడటం బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇలీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “విద్యార్థుల ఉద్యమమే తెలంగాణను సాధించినది. ఇప్పుడు అదే యువత డ్రగ్స్ పట్ల ఆకర్షితమవుతున్నారంటే తట్టుకోలేకపోతున్నాం. ఉద్యమం మన రక్తంలో ఉంది. ఇప్పుడు డ్రగ్స్ వ్యతిరేకంగా కూడా ఉద్యమం అవసరం” అని అన్నారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్, గంజాయి వ్యాపారాన్ని నిర్మూలించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. “డ్రగ్స్ అమ్మితే వెన్నువిరుస్తాం అని చెప్పాం.. ఇప్పుడు చెప్పినట్టు చేయగల సామర్థ్యం ఉంది” అంటూ స్పష్టంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఇకపై ఏ విద్యాసంస్థలోనైనా డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మెగాస్టార్ చిరంజీవి 50 ఏళ్ల కఠిన శ్రమతో ఉన్నత స్థాయికి ఎలా చేరుకున్నారో గుర్తు చేస్తూ, “ఆయన కుటుంబం ఎప్పటికీ డ్రగ్స్ వైపు చూడలేదు. ఆయనలా ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని పెట్టుకొని జీవితంలో ముందుకెళ్లాలి,” అని యువతకు సూచించారు. సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాల్లో రాణించి రాష్ట్రం, దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టే బాధ్యత యువతదేనన్నారు.
“పంజాబ్ వంటి రాష్ట్రంలో దేశానికి యుద్ధ వీరులు లభించినా, యువత డ్రగ్స్కు బానిస కావడంతో పరిస్థితి విషమంగా మారింది” అని ఆయన పేర్కొన్నారు. అదే పరిస్థితి ఇక్కడ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. యువతకు క్రీడలపై దృష్టి పెట్టాలని, కెరీర్ను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు రామ్ చరణ్ మరియు విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. యువతలో డ్రగ్స్ అవగాహన పెంచే కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉన్నదని వారు తెలిపారు.