టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, లోకేశ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెల 26న అరెస్ట్ అయిన పోసానికి, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం జైలు నుంచి విడుదల అయ్యారు.
జైలు గేటు నుంచి బయటకొచ్చిన వెంటనే పోసాని భావోద్వేగానికి లోనయ్యారు. తన మీద పెట్టిన కేసులు, గత నెల రోజులుగా జైలులో గడిపిన అనుభవాలు, ఎదుర్కొన్న పరిస్థితులను తలుచుకుని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.
పోసానిని ఫిబ్రవరి 26న ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయనపై చంద్రబాబు, పవన్, లోకేశ్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మార్ఫింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన పోసానిని రాజంపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు.
అయితే, ఇదే వ్యవహారంలో ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో మరో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో PT వారెంట్పై ఆయా కోర్టుల్లో హాజరుపరిచారు. రాజంపేట, నరసరావుపేట కేసులతో పాటు ఇటీవల నమోదైన కేసుల్లోనూ పోసానికి బెయిల్ వచ్చినా, CID పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో విడుదల ప్రక్రియ ఆలస్యమైంది.
చివరికి శుక్రవారం హైకోర్టు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేయడంతో పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనపై జరిగిన పరిణామాలపై స్పందించే అవకాశం ఉండడంతో, త్వరలోనే మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది.