మార్క్ శంకర్ హెల్త్ అప్ డేట్: ఇంకా 3 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలోనే పవన్ కొడుకు..!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగవుతోందని సమాచారం. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్‌ను ఈరోజు అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. బ్రాంకో స్కోప్ ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది.

మంగళవారం సింగపూర్‌లోని ఓ స్కూల్ బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. తన కుమారుడి పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ప్రమాద సమయంలో వచ్చిన పొగ వలన మార్క్ ఊపిరితిత్తులకు ఇబ్బంది ఏర్పడటంతో ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి వెంటనే చికిత్స అందించారు. అలాగే, పొగ వల్ల భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన వైద్యులు బ్రాంకో స్కోపీ ద్వారా అంతర్గతంగా పరిశీలన చేపట్టారు. ఈ ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఉన్న పరిస్థితిని కెమెరా ద్వారా పరీక్షించగలుగుతారు.

మార్క్ కు చేతులు, కాళ్ళకు స్వల్పంగా కాలిన గాయాలు అయినప్పటికీ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ఫోకస్ పెట్టి చికిత్స చేస్తున్నారు. వైద్యుల ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అయితే పూర్తి పరీక్షలు పూర్తయ్యే వరకూ ఆయనను జనరల్ వార్డులో పర్యవేక్షించనున్నారు.

Leave a Reply