ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా, అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సభను నిర్వహించింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
“రాసిపెట్టుకోండి.. 2029లో కూడా మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది” అంటూ ధీమాగా ప్రకటించారు. ఇప్పటి ప్రభుత్వ విజయం, పరిపాలన ప్రజలకు నచ్చిందని, అది మరోసారి గెలుపును ఖాయం చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
“చాలా కష్టాల మధ్య అధికారంలోకి వచ్చాం. విభజన తర్వాత రాష్ట్రం ఎలా నష్టపోయిందో చూశాం. 2014 నుంచే అభివృద్ధి కోరుతూ నిస్వార్థంగా పనిచేశా. 2019-2024 మధ్య కాలంలో విధ్వంసకర పాలన రాష్ట్రాన్ని తలకిందులు చేసింది” అని అన్నారు.
ఆ సమయంలో “ఏదైనా మాట్లాడాలంటే రౌడీలు వస్తారు, అధికారులు నిస్సహాయంగా చూస్తూ ఉండేవారు” అని పేర్కొన్నారు. “చంద్రబాబు గారు మొదలు సాధారణ ప్రజల వరకు అందరినీ భయపెట్టే పరిస్థితి ఏర్పడింది” అని విమర్శించారు.
“2024 ప్రారంభంలో విశాఖలో నాకు ఎదురైన ఇబ్బందులు మీకు తెలుసు. జగన్ పాలన పూర్తిగా ఇష్టారాజ్యం. కానీ ఇప్పుడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తోంది” అని వివరించారు.
అలాగే, “చంద్రబాబు నాయుడి అనుభవం ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు కీలకంగా మారుతోంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటికే పెన్షన్ల పెంపు లాంటి పథకాలు అమల్లో ఉన్నాయి” అని తెలిపారు.