Pawan Kalyan: డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదే.. అభివృద్ధే లక్ష్యమంటూ పవన్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌ అంటే కేవలం మాటల కోసం కాదు, అభివృద్ధి పనులకు వేగం తీసుకొచ్చే శక్తి అని స్పష్టం చేశారు. “డబుల్ ఇంజిన్ అంటే డబుల్ పవర్.. కేంద్రం, రాష్ట్రం ఒకే దిశగా నడిచినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది,” అని వ్యాఖ్యానించారు.

రాజమండ్రిలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ఆయన అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యాటక రంగం రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని, దాదాపు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టుతో లభించనున్నాయని వివరించారు.

రూ.430 కోట్ల వ్యయంతో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌కు 974 కిలోమీటర్ల తీర రేఖ ఉంది. గోదావరి, కృష్ణా, వంశధార వంటి నదీ తీరాలు ఉన్నాయన్నా, మన దేశంలో ఇవి జీవిత విధానం, సంస్కృతిలో భాగమవుతాయి” అని చెప్పారు.

పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. గోదావరి హారతి, ఘాట్ లోని ఆలయ విశిష్టతను ప్రదర్శించే ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరం, కడియం, నిడదవోలు పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

127 ఏళ్ల చారిత్రక హేవ్‌లాక్ వంతెనను ఆధునీకరించి, పర్యాటక ఆకర్షణగా మార్చే విధంగా కూడా చేస్తామని ప్రస్తావించారు.

Leave a Reply