ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో నివసిస్తున్న ఆయన మతసభల కోసం తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి బుల్లెట్ బైక్పై రాజమండ్రి వెళ్లి, అక్కడి నుంచి రాజానగరం చేరుకునే క్రమంలో ఆయన రోడ్డుపక్కన మృతదేహంగా కనిపించడం స్థానికులను, అనుచరులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
స్థానికులు, అభిమానులు ఆయన మృతి సహజ కారణాలతో కాదని, ఎవరో దాడి చేసి హత్యచేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన వారంతా పెదాలపై గాయాలు, రాడ్డుతో కొట్టినట్లు ఉన్న గాయాలను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి ఆయన మృతదేహాన్ని తరలించగా, అక్కడ క్రైస్తవ మత బంధువులు ధర్నాకు దిగారు.
View this post on Instagram
గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేకమంది నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. తన ప్రాణానికి ముప్పు ఉందని ఇటీవల ఆయన స్వయంగా వెల్లడించారని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ, పోలీసులు ఆయనకు తగిన రక్షణ కల్పించలేకపోయారని మతసంబంధ సంస్థలు విమర్శిస్తున్నాయి. ఈ ఘటనపై క్రైస్తవ మత ప్రచారకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో మతవర్గాల మధ్య మాటల యుద్ధాలు పెరిగి, పరస్పరం విమర్శలు, ఛాలెంజ్లు, మరింత ముదిరితే ప్రత్యక్ష ఘర్షణలకూ దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మరిన్ని వివాదాలకు కారణమవుతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
View this post on Instagram
ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఇది ప్రమాదజనిత మృతినా? లేక ఎవరైనా హత్యచేశారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదికలు, సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారనున్నాయి.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి గల అసలైన కారణాలు తెలియజేయాలని ఆయన అనుచరులు, మతప్రబోధకులు డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram