పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసును పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రవీణ్ మరణానికి ముందు జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడానికి సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ప్రవీణ్ రాజమహేంద్రవరానికి చేరుకునే ముందు విజయవాడలో ఆగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి వరుసగా ఏం జరిగిందో దాదాపు నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన ప్రవీణ్, కోదాడలో మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఫోన్పే ద్వారా రూ. 650 చెల్లించినట్లు గుర్తించారు.
ప్రమాదానికి గురైన బుల్లెట్ బైక్ హెడ్లైట్ పగిలిపోవడంతో పాటు సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. చేతులకు గాయాలు అయినట్లు సమాచారం. గొల్లపూడి చేరుకున్న ప్రవీణ్ పెట్రోలు బంకులో ఇంధనం నింపుకున్నారు. అప్పటికే అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నారని బంకు ఉద్యోగులు పోలీసులకు తెలిపారు.
బుల్లెట్పై మహానాడు జంక్షన్ చేరుకున్న ప్రవీణ్, రామవరప్పాడు రింగ్ సమీపంలో పడిపోయినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు అయ్యింది. స్థానిక పోలీసులు ఆయనను పైకి లేపి రెయిలింగ్ వద్ద కూర్చోబెట్టారు. రాత్రి 8.20 వరకు అక్కడే విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసులో పోలీసులు 200 కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించారు. విజయవాడలోకి ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. సాయంత్రం 4.45 గంటలకు గొల్లపూడిలోని పెట్రోలు బంకుకు చేరుకున్న ప్రవీణ్, 5.13 గంటలకు మహానాడు కూడలిలో కనిపించారు.
5.30 గంటలకు ట్రాఫిక్ పోలీసులు ప్రవీణ్ను రామవరప్పాడు రింగ్ వద్ద బూత్కు తీసుకువచ్చారు. అక్కడ 8.20 గంటల వరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి 8.47 గంటలకు ఏలూరు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఇప్పుడు ఈ ఆధారాలతో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ప్రవీణ్ మరణానికి అసలు కారణం ఏమిటి? ఇది ప్రమాదమా, లేక మరేదైనా అనుమానాస్పద ఘటన ఉందా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.