హైదరాబాద్ను షాక్ కి గురి చేసిన హృదయ విచారక ఘటన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గాజులరామారం ప్రాంతంలో జరిగిన ఈ ఘోరం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టేలా చేసింది. కన్నతల్లి తాను పెంచుకున్న ప్రాణాలను నరికి చంపేసిందంటే… ఆ మహిళ మానసిక స్థితి ఎంత భయానకంగా మారిపోయిందో ఊహించడమే కష్టమైపోతుంది.
తేజస్విని అనే 35 ఏళ్ల మహిళ తన ఇద్దరు చిన్నారులు.. ఆశిష్ (8), హర్షిత్ (6) లను ఇంట్లోనే వేట కొడవలితో దారుణంగా నరికి హత్య చేసిన అనంతరం, తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నాలుగు సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి గాజులరామారంలోని సహస్ర మహేశ్ హైట్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆమె, మానసికంగా కోలుకోలేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.
తేజస్వినికి కొంతకాలంగా కంటి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంతేకాదు, పెద్ద కుమారుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో తీవ్రంగా బాధపడుతుండగా, చిన్న కుమారుడికి కూడా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చేవి. పిల్లల వైద్యం కోసం గూగుల్లో తెలుసుకుంటూ, స్వయంగా మందులు కొనుగోలు చేస్తూ… అన్నీ తానే చూసుకునే ప్రయత్నంలో ఆమె పూర్తిగా ఒత్తిడికి లోనయ్యారు.
అలాంటిది.. భర్త గండ్ర వెంకటేశ్వర్ రెడ్డి మాత్రం కనీస సానుభూతి చూపించలేదని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. “పిల్లల గురించి మాట్లాడితే ‘ముగ్గురం చచ్చిపోండి’ అంటాడు.. ఇక బతికే శక్తిలేదు” అనే వాక్యాలు ఆ నోట్లో కనిపించాయి.
గురువారం సాయంత్రం తేజస్విని 6 పేజీల సూసైడ్ నోట్ రాసిన వెంటనే ఇంట్లో ఉన్న ఆశిష్, హర్షిత్లపై విచక్షణారహితంగా దాడి చేసింది. చిన్నారులు ఎంత ఘోరంగా అరచినా, వంటింట్లోకి, పడకగదిలోకి పారిపోయినా… ఆమె వదలలేదు. నరికి, ముక్కలు ముక్కలుగా కోసి హత్య చేసింది. ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా, హర్షిత్ ఆసుపత్రికి తరలించబోతుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు.
ఇంత దారుణం చేసిన తేజస్విని చివరికి ఆరో అంతస్థు నుంచి దూకి తన జీవితం కూడా అంతమొందించుకుంది. అక్కడికక్కడే మృతిచెందింది.
ఇంట్లో నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. “భర్త పట్టించుకోవడం లేదు.. పిల్లల ఆరోగ్యం నా బతుకును నరకంగా మార్చింది. ఇక బతికే శక్తిలేదు. ముగ్గురం చనిపోతున్నాం” అంటూ ఆమె చివరి మాటలు రాశారు.
ఈ సంఘటనతో సమాజంలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతుంది. ఒత్తిడితో జీవితం ఎలా చెదిరిపోతుందో ఈ విషాదకర ఘటన మనకి గుర్తు చేస్తోంది.