తెలంగాణ రాజకీయాల్లో బాంబ్ పేలింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి రంగం సిద్ధమైందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసుగుచెందారని, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు సైతం ఆగ్రహంగా ఉన్నారని వెల్లడించారు. అంతే కాదు.. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ను కూల్చేయాలన్న డిమాండ్ కూడా పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Breaking :
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారని హాట్… pic.twitter.com/jGt25gT935
— Telangana Awaaz (@telanganaawaaz) April 15, 2025
“ఇవాళ ప్రజలకే కాక, బిజినెస్ వర్గాలకూ ఈ ప్రభుత్వం మోత మోగిస్తోంది. బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు అసహనంతో ఉన్నారు. వాళ్లే ముందుకొచ్చి చెబుతున్నారు.. ఎమ్మెల్యేలను కొంటే ఆ ఖర్చు అంతా మేమే భరిస్తాం, కానీ ఈ ప్రభుత్వాన్ని తొలగించండి అని!” అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ విసిగిపోయారు. బిల్లులు రావడం లేదు, పనులు ఆగిపోయాయి. సర్పంచులు లబోదిబోమంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. డ్రైనేజీలు మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆపేశారు. ఇదేం పాలన?” అంటూ ప్రశ్నించిన ఆయన, రేవంత్ పాలనతో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని మండిపడ్డారు.
“రాజకీయాల్లో నిజాయతీగా ఉంటే పని జరగదు. కాస్త దురుసుగా ఉండటం తప్పదనిపిస్తోంది. మా దుబ్బాకలోనే పరిస్థితి ఇలా ఉంటే, మిగతా చోట ఇంకెలా ఉండొచ్చు?” అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన – మంత్రి పొంగులేటి
ప్రభుత్వాన్ని కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన
ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు పదేపదే అంటున్నారు
దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి
కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి… pic.twitter.com/onbDgW0DvN
— Telugu Galaxy (@Telugu_Galaxy) April 15, 2025
ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం మరింత ఘాటుగా రిప్లై ఇచ్చారు. “ప్రభుత్వాన్ని కూల్చాలన్నది తండ్రీకొడుకుల అజెండా. తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్.. ఈ ఇద్దరూ రేవంత్ గవర్నమెంట్ను పడగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే ఎంత మంది ఎమ్మెల్యేలు కావాలో కొని చూపించండి. ప్రభుత్వం భయపడదు, భూభారతి అమలు తప్పదు,” అంటూ తేల్చిచెప్పారు.
“కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. కేసీఆర్ ఆత్మ ఆయనలోకి వెళ్ళినట్టు అనిపిస్తోంది. రాష్ట్రంలో దుమారం కలిగించాలనే కుట్రలే ఇవన్నీ. ప్రజలు బీఆర్ఎస్ డ్రామాలకు మళ్ళీ బలికారు,” అంటూ పొంగులేటి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. బీఆర్ఎస్ వ్యాఖ్యల వెనుక నిజంగానే ప్లాన్ ఉన్నదా? లేదా మానసికంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలన్న పంతమా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.