తన పరువు ప్రతిష్టను లక్ష్యంగా చేసుకొని కావాలనే కుట్రలు పన్నుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అసత్య ఆరోపణలతో వీడియోలు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు.
తనను బ్లాక్మెయిల్ చేస్తున్నవారంతా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, తాను ఏ దందా చేయలేదని, తన ‘దందా’ అన్నదే ప్రజా సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన వైన్స్ దుకాణదారులు వస్తే వారిని గౌరవంగా కూర్చోబెట్టి టీ ఇచ్చానని, అయితే ఆ టీ లోనే విషం కలిపారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ కుట్రలో తీన్మార్ మల్లన్న పాత్ర ఉందని ఆరోపించారు. కారణం, వీడియో తీసిన వ్యక్తి ప్రస్తుతం మల్లన్నతో కలిసి తిరుగుతున్నాడని చెప్పారు. తాను దళితుడిగా ప్రభుత్వంలో ఉన్నట్టు చూసి కొంతమందికి ఇష్టం లేకపోవడంతో ఈ దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
సామాజిక న్యాయంపై పెద్ద పెద్ద మాటలు చెప్పే వారే ఇప్పుడు బ్లాక్మెయిల్కు దిగారని ఆరోపించారు. ‘‘దమ్ముంటే తుంగతుర్తి గడ్డమీదకి వచ్చి నాపై చేసిన ఆరోపణలు నిరూపించండి. నాకు ఎవరు డబ్బులు ఇచ్చారో చెప్తే బాగుంటుంది. లేకపోతే చట్టపరంగా చర్యలు తప్పవు,’’ అని హెచ్చరించారు.
‘‘మందుల సామేల్ అనే నేను ఉద్యమకారుడిని. నీతి, నిబద్ధతతో బతుకుతున్నాను. ఇది అందరూ గుర్తుంచుకోవాలి,’’ అని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.