కేటీఆర్ కు పార్టీ పగ్గాలు..? హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కేటీఆర్ నాయకత్వం వహించినా, తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పానని హరీష్ రావు గుర్తు చేశారు.

ఈ రోజు తెలంగాణ భవనంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. దేశం సరిహద్దుల్లో సైనికులు యుద్ధం చేస్తే, రైతులు తమ పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్న స్థితి దయనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగిపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

తదుపరి, వరుసగా రైతులు ఎండలో నిలబడలేక ప్రాణాలు కోల్పోతున్నారని, కనీస వసతులు లేని కొనుగోలు కేంద్రాలపై ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏవీ అమలుకాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ స్వయంగా ఆ హామీలకు హామీగా నిలిచారని గుర్తు చేశారు.

రైతులకు న్యాయం చేయమని అడిగితే ‘అప్పులు రావడం లేదు’ అని చెప్పే ముఖ్యమంత్రిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌కు అప్పులు ఇచ్చే బ్యాంకులు, తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు అప్పులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని నమ్మి అప్పులు ఇవ్వలేరు అనే స్థితి ప్రభుత్వ పరిపాలనపై నమ్మకం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

తీవ్ర వర్షాలతో తడిసిపోయిన ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను తొలగించడంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పని చేయాలని సూచించారు.

Leave a Reply