మేడిగడ్డపై చర్చకు రమ్మని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరో సంచలన సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. చర్చను మేడిగడ్డ వద్దనే పెట్టాలని స్పష్టం చేస్తూ, రేవంత్‌కు దమ్ము ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును “కూలేశ్వరం” అని విమర్శించిన రేవంత్ నాగార్జునసాగర్ కట్టపై కాకుండా మేడిగడ్డ వద్దకు వచ్చి చర్చించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే మేడిగడ్డ వద్దకు వెళ్లి సవాల్ విసిరినా, రేవంత్ చర్చకు రావడానికి భయపడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దిగజారుడు భాషలో మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ రేవంత్‌లాంటి వ్యక్తులు పదవుల్లోకి వస్తారని ఊహించి ఉండి ఉంటే రీకాల్ వ్యవస్థను తీసుకొచ్చేవారని విమర్శించారు. రాజకీయాల్లో తిట్లు వాడటం ఇష్టం లేకపోయినా, రేవంత్ ఉపయోగిస్తున్న భాషకు సమాధానంగా “కుక్క కాటుకు చెప్పు దెబ్బ” అన్నట్లు తిరిగి తిట్టక తప్పడం లేదని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు రేవంత్‌కు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ఇదివరకే రైతు సంక్షేమంపై ఎవరు ఏం చేశారో తేల్చుకుందాం రమ్మని, రేవంత్ రెడ్డిని ప్రెస్ క్లబ్‌కి రావాలని కూడా కేటీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Leave a Reply