Konda Surekha: పైసలిస్తేనే ఫైళ్లపై సంతకాలు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు ఫైళ్లు క్లియర్ చేయడానికి మామూలుగా డబ్బులు తీసుకుంటారని ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.5 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, ‘‘వర్షాకాలంలో తరగతి గదుల్లోకి నీళ్లు వచ్చి విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కాలేజీకి కొత్త భవనం అవసరమైంది. అయితే ఆ భవనానికి రూ.4.5 కోట్లు అవసరం. అంత మొత్తాన్ని ప్రభుత్వ నిధులతో సాధించలేననే ఉద్దేశంతో, నేను అటవీ శాఖ మంత్రిగా కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియర్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు.. అలాంటి సందర్భాన్ని ఉపయోగించి వారికి సూచించాను. ‘మాకు డబ్బులు ఇవ్వకండి. కానీ, మీరు ఆ డబ్బుతో సమాజానికి మేలు చేయండి. మా ప్రాంతంలో స్కూల్ భవనం నిర్మించండి’ అని చెప్పాను’’ అన్నారు.

ఆమె వ్యాఖ్యల ప్రకారం, అరబిందో సంస్థకు చెందిన సదానంద రెడ్డి ఈ ప్రతిపాదనను అంగీకరించి, రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చారు. దీనివల్ల గ్రౌండ్‌తో పాటు 15 తరగతి గదులు, ఆడిటోరియం, పెద్ద హాల్, 60 టాయిలెట్లు, ఆధునిక ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖ ప్రజలకు చెప్పాల్సిన అంశం వేరే అయినా.. పరోక్షంగా మంత్రులపై లంచాల ఆరోపణ చేసినట్లైంది. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Leave a Reply