KCR: డైరీలో రాసిపెట్టుకోండి.. మళ్లీ అదే జరుగుతుంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు. “కాంగ్రెస్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఏడాదిన్నర పాలనలోనే 2014 కంటే దారుణంగా రాష్ట్రాన్ని తయారు చేశారు” అంటూ మండిపడ్డారు. “డైరీలో రాసిపెట్టుకోండి.. రాబోయే ప్రభుత్వం మళ్లీ బీఆర్ఎస్‌దే” అని ధీమా వ్యక్తం చేశారు. సభ ప్రారంభంలో పహల్గాం ఘటనపై స్పందిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

25 ఏళ్ల పోరాటం.. బీఆర్ఎస్ బలమైన శక్తిగా

తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఒక్కడిగా ప్రారంభించిన బీఆర్ఎస్‌ను కోట్ల సైన్యంగా తీర్చిదిద్దానని గుర్తు చేశారు. “పదవుల కోసం మేము ఎప్పుడూ పాకులాడలేదు. కానీ కాంగ్రెస్ నేతలు పదవుల కోసం తెలంగాణను నాశనం చేశారు” అన్నారు. జయశంకర్ సార్‌తో కలిసి జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, గులాబీ జెండా వెనుక వందలాది ప్రాణత్యాగాలు ఉన్నాయని చెప్పారు.

రైతు కోసం కడుపులో పెట్టుకుని పరిరక్షణ

రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాల అమలును గుర్తు చేశారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ఘనత తమదేనని చెప్పారు. 40 వేల కోట్ల ఐటీ ఆదాయాన్ని రెండు లక్షల కోట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మత కలహాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించిన తమ పాలనను హైలైట్ చేశారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు

“కాంగ్రెస్ రాష్ట్రానికి నెం.1 విలన్. రైతు బంధు అమలు చేయలేకపోయారు. పింఛన్ పెంపు లేదు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వలేకపోయారు. వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయారు” అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. “420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు” అని ధ్వజమెత్తారు.

ఆర్థిక సంక్షోభం.. రియల్ ఎస్టేట్ పతనం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “భూముల ధరలు పడిపోయాయి. రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ పరిపాలనలో అవగాహన కొరవడింది” అన్నారు.

నెం1 రాష్ట్రాన్ని 15వ స్థాయికి తీసుకెళ్లిన కాంగ్రెస్

“ఒప్పందాలు గమ్మెదీ.. పేదలకు గుడిసెలను కూడా కూల్చేస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల కలలను చిదిమేస్తున్నారు. నెం1 రాష్ట్రాన్ని 15వ స్థాయికి పడగొట్టారు” అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ కిట్‌ కూడా నిలిపేశారు

పేదల కోసం రూపొందించిన కేసీఆర్ కిట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సభలు పెట్టినా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. “బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు. పోలీసులు కూడా రాజకీయం మానాలి. మీరు డ్యూటీ చేయండి” అని హెచ్చరించారు.

ముగింపు సందేశం

“ఇంకో మూడేళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగితే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రజలు, మేధావులు ఇప్పుడు మేలుకోవాలి. పరిష్కారానికి మార్గం వెతకాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply