Kavitha: కవిత స్ట్రాటజీ: కొత్త ఆఫీస్ ప్రారంభం.. జూన్ 4న ఇందిరా పార్క్‌లో భారీ ధర్నా

బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఆమె రాజకీయ చర్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈరోజు (మే 31) కవిత హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్న కవిత, జూన్ 4న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బహిరంగ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం – మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకతను వ్యక్తపరచడమే. ఆమె అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.

ఇటీవల కాలంలో కేసీఆర్ కుటుంబంలో వ్యతిరేక వాతావరణం కనిపిస్తోంది. కవిత-కేటీఆర్ మధ్య అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల లీకైన లేఖలో కవిత, పార్టీ విషయంలో తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించడం, బీజేపీతో కలయికకు తీవ్రంగా వ్యతిరేకతను తెలియజేయడం పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

కవిత మాట్లాడుతూ, “తనకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు, పార్టీని కాపాడే తపన మాత్రమే ఉంది” అని స్పష్టం చేశారు. “బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయొద్దు” అన్నదే తన నిశ్చయమని తెలిపారు. జైల్లో ఉన్న సమయంలోనే పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారన్న ఆరోపణలను కూడా ఆమె స్పష్టంగా బయటపెట్టారు. “అది నేను అంగీకరించను” అని స్పష్టం చేశారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కమిషన్, కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు విచారణ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రకటించారు.

ఓవైపు కేసీఆర్‌కు తన మద్దతు కొనసాగుతుందంటూనే, మరోవైపు కేటీఆర్‌ను పరోక్షంగా టార్గెట్ చేయడం రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీస్తోంది. జూన్ 4న ఇందిరా పార్క్‌లో కవిత వేదికపై ఏ వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్ అయింది.

Leave a Reply