బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కి తాను లేఖ రాసిన విషయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ధృవీకరించారు. రెండు వారాల క్రితమే ఆ లేఖను రాసినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే, ఆ లేఖను పార్టీ అంతర్గతంగా మాత్రమే పంపినా, దాన్ని ఎవరో కుట్రపూరితంగా లీక్ చేశారని కవిత ఆరోపించారు.
అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న కవిత, అక్కడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ను “దేవుడు”గా అభివర్ణించిన ఆమె… ఆయన చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి శక్తుల వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
లేఖలో వ్యక్తిగత అభిప్రాయాలేమీ చెప్పలేదని, కార్యకర్తల నుంచి వచ్చిన స్పందనలకే తాను ప్రతినిధిగా వ్యవహరించానని ఆమె స్పష్టం చేశారు.
కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి @RaoKavitha
రెండు వారాల క్రితం తానే కేసీఆర్ కి లేఖ రాశానని BRS MLC కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నాకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనుక కుట్ర ఉంది. pic.twitter.com/tEyIECdHdt
— Sateesh Vinjam (@Sateesh_Vinjam) May 23, 2025
లేఖల మీద కుట్ర: పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపణ
తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని కవిత స్పష్టం చేశారు. గతంలోనూ కేసీఆర్కు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈసారి లేఖ బయటకు రావడం బాధాకరమని అన్నారు. దీనికంతటికీ కారణం పార్టీలోని కొందరు కోవర్టులేనని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
“కేసీఆర్నే మా నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే మేము పని చేస్తాం” అని స్పష్టం చేసిన కవిత, పార్టీలో లోపాల్ని సరిదిద్దుకుంటేనే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు సరైన ప్రత్యామ్నాయం కాదని విమర్శించిన కవిత.. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరమన్నారు.
“పార్టీ, కుటుంబం రెండూ ఐక్యంగా ఉన్నాయి. కేసీఆర్గారే మా నాయకుడు. నాకు ఇతర ఆలోచనలు లేవు” అని ఆమె తేల్చిచెప్పారు.