Kaleshwaram Commission: 45 నిమిషాల విచారణ.. కమిషన్ ఎదుట హరీశ్ రావు చెప్పిన సమాధానాలు ఇవే..!

తెలంగాణ అతి ప్రాముఖ్యమైన కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నడుస్తున్న నేపథ్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం న్యాయ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌ హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో విచారణ నిర్వహించింది. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన ఈ విచారణలో, హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం కురిసింది.

ప్రారంభంలో హరీశ్ రావు ప్రమాణం చేయగా, తాను తెలుగు మీడియం చదువుకున్నవాడినని, పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడలేనని తెలిపారు. కమిషన్ దీనిని పరిగణలోకి తీసుకొని, అవసరమైతే హిందీలో లేదా తెలుగులో సమాధానాలు ఇవ్వవచ్చని సూచించింది. అయితే, టెక్నికల్ అంశాలపై అడిగిన కొన్ని ప్రశ్నలు హరీశ్ రావు సరిగా అర్థం చేసుకోలేక, ఆ బాధ్యత అధికారులదేనని సమాధానమిచ్చారు.

తుమ్మడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్పు ఎందుకు?
ఈ మార్పు కేంద్ర సర్వే సంస్థలు, టెక్నికల్ కమిటీలు, హైపవర్ కమిటీలు, రాష్ట్ర క్యాబినెట్ సబ్‌కమిటీ సూచనల మేరకేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. మహారాష్ట్ర అభ్యంతరాల కారణంగా ప్రాజెక్ట్‌ను మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని తెలిపారు. 152 అడుగుల కంటే తక్కువ ఎత్తులో నీటి నిల్వ ఉండదని సీడబ్ల్యూసీ కూడా సూచించిందని వివరించారు.

కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై వివరణ
ఆర్థిక పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉందని హరీశ్ రావు చెప్పారు.

ప్రాజెక్టు ఖర్చుల భారం ఎలా మోయాలనుకున్నారంటే?
ప్రాజెక్టు కేవలం సాగు కోసం మాత్రమే కాదు, పరిశ్రమలు, తాగునీటి అవసరాల కోసం కూడా రూపొందించామని చెప్పారు. కోకోకోలా వంటి కంపెనీల అవసరాలను తీర్చాలనే దృష్టితో ప్రణాళిక వేసినట్లు చెప్పారు. అయితే, కొవిడ్ కారణంగా కొన్ని కంపెనీలు ముందుకు రాలేకపోయాయని తెలిపారు.

ప్రాజెక్టు లొకేషన్ మార్పులు – చరిత్రలో ముందున్న ఉదాహరణలు
నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టుల లొకేషన్ మార్పులను ఉదాహరణగా చూపిస్తూ, మేడిగడ్డ మార్పు కూడా టెక్నికల్ కమిటీల సూచనల మేరకేనని తెలిపారు.

బ్యారేజీల నిర్మాణంపై
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం అధికారులు, మంత్రుల సమీక్షల తరువాతే నిర్ణయించబడిందని, మేడిగడ్డ నిర్మాణానికి ముందు అనేక సమావేశాలు జరిగినట్లు వివరించారు.

నీటి నిల్వ సామర్థ్యం గురించి?
140 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉన్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు రిజర్వాయర్లు, బ్యారేజీల సంఖ్య పెంచినట్లు వెల్లడించారు.

Leave a Reply