ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (CAT) నుండి బిగ్ రిలీఫ్ లభించింది. తనను తిరిగి తెలంగాణకే కేటాయించాలన్న ఆమె అభ్యర్థనను క్యాట్ ఆమోదించింది. డీవోపీటీ ఉత్తర్వులతో నాలుగు నెలల క్రితం ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్కు వెళ్లగా, ఈ కేటాయింపును ఆమె క్యాట్లో సవాల్ చేశారు. తాజా విచారణలో ఆమెకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది.
ఈ నేపథ్యంలో ఆమ్రపాలి మళ్లీ తెలంగాణకే బదిలీ కావడం ఖరారైంది. గతంలో ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్గా పనిచేశారు. ఏపీకి వెళ్లిన తరువాత అక్కడ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా, టూరిజం అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాల ప్రకారం, తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, ప్రశాంతి, ఆమ్రపాలి తో పాటు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను ఏపీ కేడర్కు కేటాయించింది. అదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న సృజన, శివశంకర్, హరికిరణ్ తదితరులను తిరిగి తెలంగాణకు పంపిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆమ్రపాలి మాత్రం తెలంగాణలోనే కొనసాగించాలని కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వుల కోసం క్యాట్ను కోరుతూ, డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ఆమె అభ్యర్థనను అనుమతించడంతో మరోసారి ఆమె తెలంగాణలో సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు.