హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దాడులు: గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు..!

కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా (HYDRA) తిరిగి యాక్టివ్‌ అయింది. శేరిలింగంపల్లి మండలంలో అక్రమ నిర్మాణాలపై మరొకసారి కఠినంగా స్పందించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్, ఫుడ్‌కోర్ట్‌ వంటి నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

ఈ ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్లు 124, 127 పరిధిలో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గతంలో వేసిన లేఅవుట్‌ను ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో చర్యలు చేపట్టారు. సుమారు 20 ఎకరాల ఈ లేఅవుట్‌లో 162 మంది సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, సంధ్యా కన్స్ట్రక్షన్స్ అనుమతులు లేకుండా ఆ ప్రాంతంలో వంటగదులు, రెస్ట్‌రూం‌లు, మినీ హాల్, ఐరన్ షెడ్‌లు వంటి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు.

హైడ్రా విచారణలో ఈ నిర్మాణాలు చట్టవిరుద్ధంగా ఉన్నట్లు తేలింది. వెంటనే చర్యలకు దిగిన అధికారులు అనుమతులు లేని కట్టడాలను మంగళవారం ఉదయం నుంచి కూల్చడం ప్రారంభించారు. రోడ్లు, పార్కులు ఆక్రమించిన ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని నిర్మాణాలు తొలగింపు లిస్టులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇకపై హైడ్రా కేవలం కూల్చివేతలకే కాకుండా, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారిని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బుద్ధభవన్ సమీపంలోని రెండంతస్తుల్లో ఈ పోలీస్ స్టేషన్‌ను మే 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Leave a Reply