Revanth Reddy: హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ లైన్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం.. ఫ్యూచర్ సిటీ పరిధిలో విద్యుత్ లైన్లన్నీ భూగర్భంగా ఏర్పాటవ్వాలని స్పష్టం చేశారు. విద్యుత్ టవర్లు, పోల్స్, తీగలు కనిపించకుండా చేయాలన్నదే లక్ష్యమని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా హైటెన్షన్ లైన్లను కూడా ఆ ప్రాంతం నుంచి పూర్తిగా తొలగించాల్సి ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాముఖ్యమైన ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని అన్నారు.

అవుటర్ రింగ్ రోడ్ (ORR) మొత్తం 160 కిలోమీటర్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. అధికారుల ప్రకారం, 2024-25లో విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరగా, 2025-26లో ఇది 18,138 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. 2034-35 నాటికి డిమాండ్ 31,808 మెగావాట్లు దాటుతుందని తెలిపారు.

రానున్న మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులు విద్యుత్ అవసరాన్ని మరింత పెంచుతాయని సీఎం స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వే, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలు, డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలు తదితర అవసరాల్ని పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా విద్యుత్ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ను భవిష్యత్ డేటా హబ్‌గా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో డేటా సిటీ స్థాపనకు అవసరమైన విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోని శాటిలైట్ టౌన్‌షిప్‌లు, రేడియల్ రోడ్లకు విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఎంతో సమన్వయం చేయాలని సూచించారు. సబ్‌స్టేషన్ల అప్‌గ్రేడ్, విద్యుత్ లైన్ల ఆధునీకరణను వేగవంతం చేయాలని తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం అన్వేషణ చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌కు ఆధునిక విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలన్నది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకేతం.

Leave a Reply