Hyderabad Metro: ప్రయాణికులకు షాక్ ఇవ్వబోతున్న హైదరాబాద్ మెట్రో..!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే ఓ ఊహించని షాక్ తగలబోతోంది. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్, టికెట్ చార్జీల పెంపును సీరియస్‌గా పరిశీలిస్తోంది. భారీ నష్టాల భారం పడుతున్న సంస్థ ఇప్పటివరకు దాదాపు రూ.6,500 కోట్ల మేర నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రయాణికులపై ఆ భారం మోపేందుకు సన్నద్ధమవుతోంది.

ఇప్పటికే కొన్ని ప్రయోజనాలను మౌనంగా తొలగించేస్తూ, చార్జీల పెంపుకు మౌలికంగా మార్గం సుగమం చేస్తోంది. ముఖ్యంగా ప్రయాణికులకు అతి తక్కువ ధరకు అందుతున్న రూ.59 హాలిడే సేవర్ కార్డ్‌ను రద్దు చేయడం, టిక్‌ట్ వినియోగదారులకు రద్దీ సమయంలో ఇచ్చే 10 శాతం డిస్కౌంట్‌ను తొలగించడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

గతంలో కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయిన నేపథ్యంలో సంస్థ ప్రభుత్వానికి ఛార్జీల పెంపు ప్రతిపాదించింది. కానీ అప్పటి ప్రభుత్వం ఆమోదించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజాగా బెంగళూరులో మెట్రో ఛార్జీలను ఏకంగా 44 శాతం పెంచినట్టు పరిశీలిస్తే, అదే దారిలో హైదరాబాద్ మెట్రో కూడా నడుస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చార్జీల పెంపుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి అవసరం లేదని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, ఫిక్స్డ్ ఛార్జీల నిర్ణయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరమూ లేదన్న అభిప్రాయం మెట్రో నిర్వహణ సంస్థలో వ్యక్తమవుతోంది.

దీంతో ప్రయాణికులకు రాబోయే రోజుల్లో ప్రయాణ ఖర్చు పెరగడం తథ్యమేనని అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే చౌక టికెట్ రాయితీలను తొలగించిన నేపథ్యంలో మెట్రో మళ్లీ టికెట్ ధరలను పెంచితే, ఇది సాధారణ ప్రజలకు భారంగా మారనుంది. ప్రయాణికుల కోసం సేవలు అందిస్తున్న హైదరాబాదు మెట్రో.. ఇప్పుడు అదే ప్రజలపై భారం మోపనుంది!

Leave a Reply