హైదరాబాద్ సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) హబ్గా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నానక్రామ్గూడలోని సోనాటా సాఫ్ట్వేర్ కొత్త ఫెసిలిటీని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన, రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకుపైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.
AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలు కూడా హైదరాబాద్కు కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలు తమ క్యాంపస్లను విస్తరిస్తుండటం రాష్ట్ర ఆకర్షణను చూపుతున్నదన్నారు.
పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ.
– శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు. pic.twitter.com/82Cf4zlqgv
— Telangana Congress (@INCTelangana) May 12, 2025
తెలంగాణ-పెట్టుబడులకు నిలయం
2025 దావోస్ పర్యటనలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి, తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టినట్లు సీఎం తెలిపారు. పోలీసింగ్, శాంతి భద్రతలు, ఉద్యోగ కల్పన, పన్నుల వసూళ్లలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
సమాజ అభివృద్ధిలో తెలంగాణ ముందంజ
66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి అవకాశాలు అందించామన్నారు. డ్రై పోర్టు, AI నగరం, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.
ప్రపంచ స్థాయి ఈవెంట్లకు తెలంగాణ సిద్ధం
మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్లో నిర్వహించటం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్కు బ్రాండ్ అంబాసడర్లుగా యువత ముందుకు రావాలి
తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు యువత బ్రాండ్ అంబాసడర్లుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.