Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. ఎదురుగానే ట్రైన్.. అప్పుడు ఏం జరిగింది..?

దీన్ని పిచ్చి అనాలో..? వెర్రితనం అనాలో..? రోడ్డుపై నడపాల్సిన కారు ఏకంగా రైలు పట్టాలపై దూసుకెళ్లితే? రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది నిజంగా జరిగిన ఘటన. ఓ యువతి తన కారును నేరుగా రైల్వే ట్రాక్‌పై నడిపి అక్కడ భయాందోళనకు గురి చేసింది.

నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్లే రైలు మార్గంలో యువతి ట్రాక్‌పై హైస్పీడ్‌లో కారుతో దూసుకెళ్లింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కారును అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఆమె వినిపించుకోలేదు. ఇదే సమయంలో లోకో పైలట్ రైలును సమయానికి ఆపేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గంటల తరబడి రైళ్లు ఆలస్యమయ్యాయి. చివరికి కారు ఆగిన తర్వాత స్థానికులు యువతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఆమెను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. యువతి ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన రబిక సోనీగా గుర్తింపు పొందింది. శంకర్‌పల్లి పోలీసులు ఆమెను వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించనున్నారు. అయితే ఆమె మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న అవకాశమూ ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. రైలు పట్టాలపై కారుతో ప్రయాణించాలనే ఆలోచనే ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

Leave a Reply