సైకో, శాడిస్ట్ ఎవడో.. బీ కేర్‌ఫుల్ బిడ్డా.. బండి సంజయ్‌కు ఈటల రాజేందర్ మాస్ వార్నింగ్..!

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. “శత్రువుతో పోరాడొచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వారితో యుద్ధం చేయలేం” అంటూ సంజయ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్‌లో బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా కార్యకర్తలు శామీర్‌పేట్‌లోని ఈటల ఇంటికి భారీగా తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ఈటల మాట్లాడుతూ, హుజురాబాద్ తెలంగాణ ప్రతీక అని, ఇకపై అక్కడ స్ట్రైట్ ఫైట్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. “మీదికి ఒక మాట, లోపల మరో మాట చెప్పడం నాకు రాదు. నేను నిజాయితీగా మాట్లాడతా.. వెనకేసుకుని మాట్లాడటం అలవాటు కాదు” అని చెప్పారు.

రాజకీయాల్లో అవమానాలు ఎదురైనా ముందుకు వెళ్లాలని ఈటల పేర్కొన్నారు. “మనకు మనంగా BRS నుంచి బయటకు రాలేదు. ఆ సమయంలో కేసీఆర్ చేసినది అదే. హుజురాబాద్‌లో ఓడిపోతా అనుకోలేదు కానీ అక్కడి ప్రజలు నన్ను కాపాడారు. అలాగే నేను వారిని కాపాడుతాను” అన్నారు. దక్షిణ భారతదేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ సభ పెట్టారని గుర్తుచేశారు. “సైకో, శాడిస్ట్.. ఎవడో ఎవరి అండతో ధైర్యం చేశాడో.. బీ కేర్‌ఫుల్ బిడ్డా. కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నా చరిత్ర ప్రజలకు తెలుసు. ధీరుడు వెనక్కి తిరగడు” అంటూ ఘాటు హెచ్చరిక జారీ చేశారు.

“హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఓడిపోలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRSకి 53 వేల మెజార్టీ వచ్చింది. వ్యక్తులు ఎదగకపోతే పార్టీ బలపడదు. నేను పదవుల కోసం కాకుండా పార్టీ కోసం, కార్యకర్తల కోసం పనిచేశాను. బీసీ బిడ్డగా మంత్రి పదవులు చేశాను. వీరుడు ఎక్కడా భయపడడు, హుజురాబాద్ గడ్డలో నా ప్రతి అనుచరుడు నాకు అండగా ఉంటాడు” అని స్పష్టం చేశారు.

“దేశ ప్రధాని వ్యక్తుల కోసం కాదు, వ్యవస్థ కోసం పని చేస్తున్నారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి ఉండాలి. రాజకీయాల్లో కొంతమంది ఇతరులను ఎదగనివ్వకుండా ఉండడమే పని. మిమ్మల్ని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. కొత్త, పాత వాళ్లు అనే తేడా లేదు. ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేదు. కోవర్టులు ఎక్కడైనా ఉంటారు.. వాళ్ల గురించి బాధపడకండి. నేను పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా, ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది. కార్యకర్తలు మరుగుజ్జులు కాదు.. కుంగిపోకండి. సముద్రంలో తుఫాన్ రాకముందు సైలెంట్‌గా ఉంటుంది. అలాగే నేను మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుంది. నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని, ప్రజలే నా న్యాయ నిర్ణేతలు” అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply