ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త తెలిపింది. వారి కుటుంబాల్లోని పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేకమైన విద్యా రుణ పథకాన్ని రూపొందించింది. ఇప్పటికే స్త్రీనిధి ద్వారా 11% వడ్డీతో రుణాలు అందుతున్నా.. అధిక వడ్డీలతో అప్పులు తీసుకుని విద్యను కొనసాగించడంలో మహిళలు ఇబ్బంది పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో కేవలం 4% వడ్డీకే (రూ.35 పైసల వడ్డీకి) విద్యా రుణాలు అందించేలా కొత్త పథకాన్ని రూపొందించింది. దీనికి “ఎన్టీఆర్ విద్యా సంకల్పం” అనే పేరును అధికారులు ప్రతిపాదించి, ప్రభుత్వానికి నివేదించారు.
ఈ పథకం కింద సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10,000 నుండి గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు రుణం పొందే అవకాశం లభిస్తుంది. కేజీ నుంచి పీజీ వరకూ చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకూ ఇది వర్తించనుంది.
తీసుకున్న రుణాన్ని సులభ వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశముందని సమాచారం.