Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు: ఐదుగురి నిందితులకు ఉరిశిక్ష ఖరారు..!

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాన్ని కలచి వేసిన 2013 ఉగ్రబాంబు పేలుళ్ల కేసులో పెద్ద ఎత్తున న్యాయ నిర్ణయం వెలువడింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పులో, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

2013 ఫిబ్రవరి 21న రాత్రి 7 గంటల సమయంలో, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ వద్ద తొలి పేలుడు, తరువాతి క్షణాల్లో కోణార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించాయి. ఈ బాంబ్ బ్లాస్ట్స్‌ వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు, 130 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థే బాధ్యత వహించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారిగా కనిపెట్టారు. అతడు ఈ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడిగా, పేలుళ్లకు మూలకారకుడిగా గుర్తించబడాడు.

NIA దర్యాప్తులో అరెస్ట్ అయిన నిందితులు:

యాసిన్ భత్కల్ (అహ్మద్‌ సిద్దిబప్ప జరార్‌)

అబ్దుల్లా అక్తర్ (హద్దిలన్)

తహసీన్ అక్తర్ (బిహార్‌)

జియా ఉర్ రెహ్మాన్ (పాకిస్థాన్)

అజీజ్ షేక్ (పుణె)

వీరు విచారణలో నేరాన్ని అంగీకరించారు. అందులో అందిన ఆధారాలపై ఆధారపడి, మొత్తం 157 మంది సాక్షులను విచారించి, 3 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.

2016 డిసెంబరులో NIA స్పెషల్ కోర్టు ఐదుగురిని దోషులుగా ప్రకటించి, వారికి ఉరిశిక్షతోపాటు జైలు శిక్షలు, జరిమానాలు విధించింది. అయితే దానికి వ్యతిరేకంగా నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ తర్వాత, ఇప్పుడు హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థించింది.

ప్రస్తుతం ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, అతడి కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి, అంతర్జాతీయ స్థాయిలో వెతుకుతున్నారు.

ఈ తీర్పుతో దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల బాధితులకు కొంత న్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇది చారిత్రక ఘట్టమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply