బీజేపీలో స్కూల్, టీడీపీలో కాలేజ్, రాహుల్‌ వద్ద ఉద్యోగం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నా పాఠశాల చదువు బీజేపీలో, కాలేజీ టీడీపీలో, ప్రస్తుతం ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నాను. ఇదంతా ఇటీవలే ప్రధాని మోదీకి చెప్పాను” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

దత్తాత్రేయ రాజకీయ ప్రయాణాన్ని ప్రశంసించిన రేవంత్, “గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్‌ వరకు ఎదిగిన దత్తాత్రేయ ప్రజలతో గాఢమైన సంబంధాలు కొనసాగించారు. పేదల కార్యక్రమాలకు కూడా హాజరయ్యే సామాన్య మనిషిగా ఆయన ఎదిగారు” అన్నారు. ఆయన చేపట్టే ‘అలయ్ బలయ్’ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిందని కొనియాడారు.

కిషన్ రెడ్డి, దత్తాత్రేయ కుటుంబాలతో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. “ఇలాంటి సంబంధాలను నేను ఎప్పుడూ దాచిపెట్టను. మంత్రివర్గ విస్తరణ ఉన్నా, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాతనే దత్తాత్రేయ కోసం వచ్చాను” అని చెప్పారు.

వేదికపై ఇతర రాష్ట్రాల గవర్నర్లు, తెలంగాణ మంత్రులు పాల్గొనగా.. ‘‘ఇది గవర్నర్‌ల పరేడ్ వేదికలా ఉంది. కాంగ్రెస్ మంత్రివర్గం మొత్తం ఇక్కడే ఉంది. కావాలంటే కేబినెట్ మీటింగ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు’’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

Leave a Reply