కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చిస్తూ, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత వహించాలని ఆదేశించారు. అలాగే, దస్త్రాల క్లియరెన్స్లో వేగం పెంచాలని మంత్రి వర్గానికి సూచనలు ఇచ్చారు.
అమరావతి: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్.. అటవీశాఖ సిబ్బందితో ఎమ్మెల్యే వివాదంపై ఆరా.. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం.. ఉద్యోగులతో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం.. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశం
— vikrant rona_updates (@RonaVikran99298) August 21, 2025
అంతేకాకుండా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారు. అటవీశాఖ సిబ్బందితో జరిగిన వివాదంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఎమ్మెల్యే ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
ఇక సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధి కోసం రూ.904 కోట్ల మంజూరు, రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్ని జిల్లాల పేర్ల మార్పు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. కాసేపట్లో మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ. pic.twitter.com/kAUsWqpiKF
— I & PR Andhra Pradesh (@IPR_AP) August 21, 2025
మరోవైపు, సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. రేపు మధ్యాహ్నం వరకు సీఎం ఢిల్లీలో ఉండనున్నారు.