CM Chandrababu: మహానాడులో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్.. వైసీపీపై ఘాటు విమర్శలు

కడప మహానాడు వేదికపై ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శక్తివంతమైన ప్రసంగం చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఉత్సాహభరితంగా మాట్లాడారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేత జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “జగన్ విధ్వంస పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టింది” అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని ధ్వజమెత్తిన ఆయన, ఎన్నో సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు తాను శ్రమిస్తున్నానని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టిపైనే తన దృష్టి ఉందని స్పష్టం చేశారు.

“రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి. మహానాడు చూసిన తర్వాత కొండనైనా ఢీకొట్టే ధైర్యం వచ్చింది. కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకు ఇక్కడ మహానాడు నిర్వహించాం. కడప ఇప్పుడు జనసంద్రంగా మారింది. మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు చూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు” అని అన్నారు చంద్రబాబు.

“ఉమ్మడి కడపలో 10 సీట్లలో 7 గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 10కి 10 గెలవాలి. టీడీపీ అధికారం కోసం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు కోసం ఏర్పడిన పార్టీ. కార్యకర్తలు ఎన్నో అవమానాలు, అరాచకాలు, బూతులు ఎదుర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి గెలిచాయి. పాలన ఎలా ఉండాలో నేర్పిన పార్టీ టీడీపీ. ఎలా ఉండకూడదో చూపిన పార్టీ వైసీపీ” అని విరుచుకుపడ్డారు.

“94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓటింగ్ షేర్‌తో ఘన విజయం సాధించాం. కొత్తవారికి సీట్లు ఇచ్చినా భారీ మెజారిటీలతో గెలిచారు. ఈ కూటమి విజయంలో టీడీపీ కార్యకర్తల పాత్ర అపారమైనది. వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలు, అణచివేతలు, బూతులకూ తట్టుకుని నిలిచాం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Leave a Reply