Cheap Liquor: ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్.. ట్రూప్స్ బార్‌లో భారీ మోసం బట్టబయలు..!

హైదరాబాద్‌లో మరోసారి కల్తీ మద్యం మాఫియా కల కలం రేపుతోంది. ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి మందుబాబులను మోసం చేస్తున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఓ బార్‌లో అధికారుల తనిఖీల్లో ఈ మోసం బట్టబయలైంది. ట్రూప్స్ బార్ అనే ఈ ప్రదేశం తమ లైసెన్స్‌ను రెన్యువల్ చేయకుండా మద్యం అమ్మకాలతో పాటు కల్తీ లిక్కర్ వ్యాపారాన్ని కూడా నడిపిస్తోంది.

ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా బార్‌లో దాడి చేయగా అక్కడ బార్ సిబ్బంది ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం నింపుతూ పట్టుబడ్డారు. రూ. 2690 ధర కలిగిన జేమ్సన్ బాటిల్లో కేవలం రూ. 1000 విలువైన ఓక్స్మిత్ బ్రాండ్ లిక్కర్ పోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కల్తీకి సిద్ధంగా ఉంచిన 75 తక్కువ ధర మద్యం బాటిళ్లు, 55 ఖాళీ ఖరీదైన బ్రాండ్ సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై బార్ ఓనర్ ఉదయకుమార్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, బార్ ఉద్యోగి పునిత్ పట్నాయక్‌లపై కేసు నమోదు చేసి వారిని లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఖరీదైన మద్యం తాగుతున్నామనుకునే మందుబాబులకు ఇది బిగ్ షాక్. కేవలం లాభాల కోసం ఇలా వినియోగదారుల ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply