ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణానికి బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనుకనున్న ఈ9 రహదారి పక్కన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మిణి, మనవడు దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు కాన్వాయ్ అమరావతిలోని రైతుల మధ్య నుంచి వస్తుండగా, జై చంద్రబాబు, జై అమరావతి అంటూ గట్టిగ నినాదాలు వినిపించాయి. ఆ సందర్బంగా కాన్వాయ్ను ఆపిన చంద్రబాబు, లోకేశ్లు అక్కడున్న రైతులను సానుభూతితో పలకరించారు. రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, వెలగపూడి గ్రామస్తులు ముఖ్యమంత్రి కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించి గౌరవించారు.
ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను మంత్రి లోకేశ్ తన కుటుంబ సభ్యులకు వివరించారు. భూమిపూజ అనంతరం చంద్రబాబు కుటుంబంతో కలిసి ఉండవల్లి వెళ్లారు. రైతుల నుంచి సుమారు ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు కుటుంబం, జీ ప్లస్ వన్ మోడల్లో సొంతింటిని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదిలోపే ఈ ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.