ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15, స్వాతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఈ స్కీమ్‌ను అధికారంలోకి వచ్చే ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారమే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ఉచిత బస్ స్కీమ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ విధానం ఎలా అమలవుతోంది అనే అంశంపై కమిటీ ఒకటి అధ్యయనం నిర్వహించిందని, దీనికి సంబంధించిన నివేదిక ఇప్పటికే ప్రభుత్వం వద్దకు చేరినట్లు చెప్పారు.

అయితే, ఈ పథకం అమలులో ఆధార్ కార్డు ఆధారంగా అమలవుతుందా? లేక రేషన్ కార్డు ఆధారంగా జరుగుతుందా అన్న విషయంపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇక విద్యారంగంపై మాట్లాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి “తల్లికి వందనం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రైతులకు ఏడాదికి రూ.14 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల చొప్పున చెల్లించనుంది.

రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, ఓర్వకల్‌కు రైల్వే ట్రాక్ తీసుకురావడంపై కృషి చేస్తున్నామని వెల్లడించారు. అలాగే, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి నెల మూడవ శనివారం శుభ్రత దినంగా పాటించాలని, అందులో ఉద్యోగులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు.

Leave a Reply