BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మి వీరంగం.. కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన ఘటన..!

కొమరంభీం జిల్లా జన్కపూర్‌లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈవెంట్‌కి హాజరైన BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్‌పై వాటర్ బాటిల్ విసిరిన ఘటన సంచలనంగా మారింది. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటి ప్రవర్తనతో అక్కడి ప్రజలు, అధికారులు షాక్ అయ్యారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, ఆగస్ట్ 7న జన్కపూర్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. అయితే ఆమె ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రసంగాలు వద్దని అభ్యర్థించగా, కోపంతో ఉన్న కోవా లక్ష్మి టేబుల్‌పై ఉన్న వాటర్ బాటిల్‌ను తీసుకుని శ్యామ్ నాయక్‌పై విసిరేశారు. అక్కడే ఉన్న కొంతమంది నేతలు, కార్యకర్తలపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటన మొత్తం మీడియా కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి ఇటువంటి ప్రవర్తన అప్రతిష్ఠకరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, కోవా లక్ష్మి మాత్రం ఇది కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నమని, కాంగ్రెస్ నేతల వైఖరే ఈ ఉద్రిక్తతకు కారణమని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై అధికార పార్టీ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ప్రచారాలు, వ్యక్తిగత దాడులు అనే విమర్శల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply