తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం రాజకీయ వర్గాల్లో విషాదాన్ని మిగిల్చింది.
మదన్ లాల్ 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఎమ్మెల్యేగా సేవలందించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 మరియు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీపై విశ్వాసం తగ్గకుండా కొనసాగుతూ, ఇటీవల కాలంలో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్ కన్నుమూత
గుండెపోటుతో ఎ.ఐ.జీ హాస్పిటల్ లో కన్నుమూత
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి బిఆర్ఎస్ లో చేరిన మదన్ లాల్
2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మదన్ లాల్
ప్రస్తుతం బిఆర్ఎస్ వైరా… pic.twitter.com/xEsw9LsrW1
— Telangana Awaaz (@telanganaawaaz) May 27, 2025
బానోత్ మదన్ లాల్ 1963 మే 3న ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేసిన ఆయన 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పట్లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతితో జరిగిన పోటీలో 47,539 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆయన రాజకీయ జీవితంలో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణం ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు వైరా ప్రజల్లో విషాదాన్ని కలిగించింది.