బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియకి తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించినా, కోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది.
పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి విష్ణుప్రియతో పాటు 11 మంది సెలెబ్రిటీలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు విచారణకు హాజరైన ఆమె, తాజాగా కోర్టులో తనపై నమోదైన కేసులను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. అయితే, కోర్టు దీనిని అంగీకరించకుండా ఎఫ్ఐఆర్లు కొనసాగుతాయని, విచారణలో సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ నెల 20న విష్ణుప్రియ తన లాయర్తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు. తలకు స్కార్ఫ్ కట్టుకుని మళ్లీ మీడియాకు కనిపించకుండా విచారణకు వెళ్లారు. పోలీసులు 11 గంటల పాటు ఆమెను విచారించారు. విచారణలో “తాను మూడు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసినట్టు” అంగీకరించిందని సమాచారం.
దీంతో, పోలీసులు ఆమెను 25వ తేదీన మళ్లీ విచారణకు రమ్మని నోటీసు ఇచ్చారు. అయితే, ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు మరోసారి విష్ణుప్రియకు భారీ షాక్గా మారింది.
తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్టార్ హీరోల దగ్గరి నుంచి సామాన్య సెలెబ్రిటీల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే హీరో రానా, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఈ వివాదంలో వినిపిస్తున్నాయి.
రోజురోజుకు ఈ వివాదం తీవ్రత పెరుగుతుండడంతో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ కేసుల విచారణను సైబర్ క్రైమ్ & ఎకనామిక్ ఆఫెన్స్ విభాగం (CAD) కి బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఈ తీర్పుతో విష్ణుప్రియకు కేసు నుంచి బయటపడే మార్గం కష్టంగా మారిందని, ఆమె విచారణ ఇంకా కొంతకాలం కొనసాగుతుందని అర్థమైంది.