హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏం జరిగింది?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. త్వరలోనే ఆయనను విచారణ కోసం స్టేషన్‌కు పిలిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక సినిమాల విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ చివరిసారిగా తెలుగు స్క్రీన్‌పై కనిపించి నాలుగేళ్లవుతోంది. ఈ గ్యాప్ తర్వాత “భైరవం” అనే మల్టీ స్టారర్ మూవీతో మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. మే 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ చుట్టూ ఇదీ కొత్త వివాదం.

ఇక కేసు వివరాల్లోకి వెళితే… మే 13న మధ్యాహ్నం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి జర్నలిస్ట్ కాలనీ వైపు బెల్లంకొండ శ్రీనివాస్ తన కారులో వెళ్తుండగా, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేశారని పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఆ కారును అడ్డుకున్నాడు. ఈ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఆయనతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, కారును అతని దిశగా వేగంగా నడపడానికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భయపడిన కానిస్టేబుల్ పక్కకు తప్పుకున్నాడని చెబుతున్నారు.

ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశిన ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. నెటిజన్లు సెలబ్రిటీగా ఉండి ఇలాంటి ప్రవర్తన ఏంటి అని విమర్శిస్తున్నారు. బుధవారం (మే 15) జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై అధికారికంగా కేసు నమోదు చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ మద్యం సేవించి వాహనం నడిపాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఆయనను స్టేషన్‌కు పిలిపించి అధికారికంగా విచారణ జరిపే అవకాశం ఉంది.

Leave a Reply