జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తానే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు మాజీ ఎంపీ అజారుద్దీన్ స్పష్టం చేశారు. తాను పోటీ చేయడం లేదన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ లోనే కొంతమంది ప్రచారం చేస్తూ తప్పుడు సమాచారం పంపుతున్నారని మండిపడ్డారు. “జూబ్లీహిల్స్లో గెలిచి రాహుల్ గాంధీకి మరో సీటును బహుమతిగా ఇస్తా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికల హైటెన్షన్ పొలిటిక్స్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక ఖాయం కాగా, ఎవరికి టికెట్? అనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ చర్చలు జోరుగా సాగుతున్నాయి. విజయారెడ్డి (పీజేఆర్ కుమార్తె), నవీన్ యాదవ్ వంటి కొత్త నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న వార్తలు వెలువడ్డాయి.
తానే పోటీ చేయబోతున్నట్టు స్పష్టం చేసిన అజారుద్దీన్, గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను చివరి క్షణంలో బరిలోకి దిగినప్పటికీ గట్టిగా పోరాడానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు మెజార్టీ ఓట్లు వచ్చేలా తన వంతు పాత్ర పోషించానన్నారు. టికెట్ రాదని చేస్తున్న ప్రచారం వ్యతిరేక వర్గాల కుట్రగా పేర్కొన్నారు.
అగ్రనేతల ఆశీస్సులు నాకున్నాయి
తనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూర్తి మద్దతుతో తానే పోటీ చేయనున్నట్లు చెప్పారు. “ఈసారి గెలిచి రాష్ట్రం నుంచి మరో ఎమ్మెల్యే సీటును రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇస్తాను” అని ధీమా వ్యక్తం చేశారు.