ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కార్మిక రంగ సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. కార్మిక రంగ అభివృద్ధికి తోడ్పడేలా, మహిళల ఉద్యోగ అవకాశాలను మరింత విస్తరించే దిశగా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల చట్టం 1948లో సవరణలు చేస్తూ మహిళా ఉద్యోగులకు రాత్రి పూట కూడా పనిచేసే అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ జరిపిన ప్రభుత్వం, వాటికి తుది ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో “ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల (సవరణ) బిల్లు – 2025” పేరుతో కొత్త బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో ముఖ్యంగా పరిశ్రమలపై విధానపరమైన నియంత్రణలను తక్కువ చేస్తూ, మహిళలకు రాత్రి పూట షిఫ్ట్లో పనిచేసేందుకు చట్టపరమైన అనుమతిని కల్పించబోతున్నారు. ఇంతవరకూ నైట్ షిఫ్ట్ అనేది మహిళలకు అందుబాటులో లేని అంశం. కానీ సమకాలీన పరిశ్రమల పని తీరును దృష్టిలో ఉంచుకుని, ఉత్పాదకత పెంచేందుకు ఈ అడుగు వేయనున్నారు.
భద్రతతోనే నైట్ షిఫ్ట్ అనుమతి
ఈ కొత్త సవరణల ప్రకారం, మహిళలు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య షిఫ్ట్లలో పనిచేయాలంటే, ముందుగా వారి లిఖితపూర్వక అంగీకారం తీసుకోవాలి. పైగా, పనిస్థలానికి రాకపోకల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలి. భద్రతా చర్యలు కూడా తప్పనిసరి. వీటి అమలు తర్వాత మాత్రమే కంపెనీలు మహిళా ఉద్యోగులను నైట్ షిఫ్ట్లో నియమించేందుకు అనుమతి పొందగలవు.
ఈ నిర్ణయంపై రాష్ట్ర సమాచార మంత్రి పార్ధసారధి మాట్లాడుతూ, ‘‘మహిళలు నైట్ షిఫ్ట్లలో పనిచేసేందుకు అన్ని విధాలా భద్రత కల్పించడంతో పాటు, వారి ఉద్యోగ అవకాశాలను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది రాష్ట్ర పరిశ్రమల ఉత్పాదకతను పెంచడమే కాకుండా, మహిళా శక్తిని గౌరవించేందుకు గల ముందడుగుగా నిలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
మహిళలు రాత్రి పూట కూడా పని చేసే చట్టసవరణకు కేబినెట్ ఆమోదం. రాత్రి పూట పని చేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి. #PrajaTeerpuDinam#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/0sKH57U18H
— Telugu Desam Party (@JaiTDP) June 4, 2025
ఇతర కార్మిక సౌకర్యాల పట్ల ప్రభుత్వం దృష్టి
ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాలను మహిళా ఉద్యోగుల కోసం అమలు చేసే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనితో పాటు, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ విధానం ద్వారా ఉద్యోగుల సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ చర్యలన్నీ రాష్ట్రంలో కార్మిక రంగాన్ని పటిష్టపరిచే దిశగా సాగుతున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీలకు ఊరట, మహిళలకు అవకాశాలు
ఈ మార్పుల ద్వారా పరిశ్రమలు నిబంధనల భారం నుంచి కొంతవరకైనా విముక్తి పొందనున్నాయి. కొత్త పెట్టుబడులకు మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఉన్న స్పెషలిటి పార్కులు, ఫ్యాక్టరీలు, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, బీపీవో, ఫార్మా రంగాల్లో మహిళల వినియోగాన్ని పెంచే అవకాశం ఉంది.
ఇవన్నీ చూస్తే, ఈ బిల్లు కేవలం నైట్ షిఫ్ట్లపై మార్పు మాత్రమే కాదు.. సంపూర్ణంగా మహిళల సమర్థతను అంగీకరిస్తూ, పరిశ్రమల అభివృద్ధికి సహకరించే మార్గదర్శకంగా నిలవబోతుందనే చెప్పవచ్చు.