ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. పునీత్ నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్ ఇన్ఫ్రా అకౌంటెంట్కు, పునీత్ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నానని, తక్షణమే రూ.1.96 కోట్లు ఒక ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. నిజంగానే పునీత్ పంపాడని నమ్మిన అకౌంటెంట్ ఆ మొత్తం మొత్తాన్ని బదిలీ చేశాడు.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా, ఫేక్ అకౌంట్లు, క్యూఆర్ కోడ్లు, లింకుల ద్వారా నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా వారి వలకు చిక్కుతున్నారు. ఈ కేసులోనూ అదే జరిగింది.
మోసపోయామని గ్రహించిన పునీత్, అకౌంటెంట్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిందితులు అరవింద్ కుమార్, సంజీవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అయితే అప్రమత్తమైన నెల్లూరు రూరల్ పోలీసులు నేరగాళ్ల ఖాతా నుంచి కోటి 40 వేల రూపాయలు ఫ్రీజ్ చేయగలిగారు. అదనంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ.49 లక్షలు విడుదలకు అనుమతించారు.
సైబర్ కుట్రలో ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ తరహా మోసాల్లో భారీ మొత్తాల ట్రాన్స్ఫర్లకు సహకరించే కరెంట్ ఖాతాదారులకు నేరగాళ్లు 2 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు.