ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో అనుభవం కలిగిన నలుగురిని గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, పారిశ్రామిక అభివృద్ధి, చేనేత, హస్తకళలు, ఫోరెన్సిక్ సైన్స్ వంటి కీలక రంగాల్లో మార్గదర్శకత్వం అందించేందుకు వీరిని కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వారు రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు.
ఈ నియామకాల ప్రకారం, స్పేస్ టెక్నాలజీ విభాగానికి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ను, ఏరోస్పేస్ & డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగానికి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డిని, చేనేత & హస్తకళల అభివృద్ధికి భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లను, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ శాస్త్రవేత్త కేపీసీ గాంధీని నియమించారు.
సోమనాథ్ రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీని వినియోగించే విధానాల రూపకల్పనపై దృష్టి సారించనున్నారు. పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఆయన సలహాలు ఇవ్వనున్నారు. అదనంగా, అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీ హబ్లు, టెస్టింగ్ సదుపాయాలు, రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుపై మార్గదర్శకత్వం అందించనున్నారు. GIS, శాటిలైట్ నావిగేషన్, AI ఆధారిత స్పేస్ ఎనలిటిక్స్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు.
ఏరోస్పేస్ & డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్పిడి చేయడంలో సతీష్ రెడ్డి కీలక భూమిక పోషించనున్నారు. పరిశ్రమల అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగంలోని రక్షణ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివిధ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
చేనేత, హస్తకళ రంగాల అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఈ రంగాల్లో పని చేసే కళాకారులు, సహకార సంస్థలు, MSME లకు మద్దతు ఇచ్చే విధంగా సుచిత్ర ఎల్ల ప్రణాళికలు రూపొందించనున్నారు. హస్తకళలకు దేశీయ & అంతర్జాతీయ మార్కెట్ను విస్తరించేలా చర్యలు చేపట్టనున్నారు.
ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి కోసం కేపీసీ గాంధీ ప్రణాళికలు రూపొందించనున్నారు. నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపు కోసం ఆధునిక ఫోరెన్సిక్ విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ ఫోరెన్సిక్ విధానాలను రాష్ట్రంలో అనుసరించేలా చూడనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ నియామకాలు కీలక మైలురాయిగా నిలవనున్నాయి. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ పరిశోధన, పారిశ్రామిక అభివృద్ధి, చేనేత & హస్తకళ, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో ఈ నిపుణుల మార్గదర్శకత్వంలో రాష్ట్రం మరింత పురోగతి సాధించనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశలో ప్రయాణం మొదలైందని చెప్పొచ్చు.