ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్ లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏసీ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
అగ్నిప్రమాదానికి తక్షణమే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అంతటి పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ముఖ్యమైన ఫైల్స్ దగ్ధమయ్యాయా లేదా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మినహా ఇతరులెవరికీ కార్యాలయం లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. త్వరలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ తదితరులు నిధి భవన్ను సందర్శించే అవకాశం ఉందని సమాచారం.
ఏపీ ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్లో అగ్ని ప్రమాదం.
కంప్యూటర్లు, ఫైళ్లు కాలిపోయినట్టు సమాచారం.
ఆ అగ్నిప్రమాదంపై అనుమానాలు. pic.twitter.com/c6O7aVqL6l
— greatandhra (@greatandhranews) May 21, 2025
ఇదే సమయంలో గత నెల 4న కూడా ఏపీ సచివాలయం లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. రెండో అంతస్తులో బ్యాటరీలు ఉండే ప్రదేశంలో మంటలు చెలరేగాయి. అదే అంతస్తులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత కార్యాలయాలు ఉండటం వల్ల ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే అదృష్టవశాత్తూ, ఉదయం సమయంలో జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.
ఈ ప్రమాదాన్ని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సెక్రటేరియట్లో సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, అలాగే భద్రతా ప్రమాణాలపై సమగ్ర ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది.