ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆయనపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ను అక్రమంగా తవ్వి తరలించారనే ఆరోపణలపై కాకాణితో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.
వైఎస్సాఆర్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకాణి గోవర్థన్ రెడ్డి అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు నిర్వహించారని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి అవినీతికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించారు. ఫిబ్రవరి 16న కాకాణి అనుచరుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాకాటి శివా రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డిలపై కేసు నమోదు చేశారు. మొత్తం పది మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్నవారు
ఏ1 – పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి
ఏ2 – వాకాటి శ్రీనివాసులురెడ్డి
ఏ3 – వాకాటి శివా రెడ్డి
ఏ4 – మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
గడువు ముగిసిన మైనింగ్ లీజును అక్రమంగా పొడిగించుకోవడం, అనుమతుల్లేకుండా జెలిటెన్ స్టిక్స్ ఉపయోగించడం, అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు చేసి క్వార్ట్జ్ను తరలించడం వంటి అక్రమాలు జరిగినట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అప్పట్లో ఆరోపించారు.
ఈ కేసులో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసకుమార్, సూపర్వైజర్ సుధాకర్, ఆర్ఐ హెచ్. దేవీసింగ్, టీఏ హసీనాబాను విచారణ చేపట్టారు. దాదాపు 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ అక్రమంగా తవ్వి తరలించారని గుర్తించి, సీనరేజ్ ఛార్జీలు మరియు జరిమానాలతో రూ.7.56 కోట్ల షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరగనున్నాయని పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అక్రమ మైనింగ్కు మద్దతు ఉన్నట్లు విచారణలో వెల్లడవుతున్నందున, కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదనే చర్చ జరుగుతోంది.
ఈ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. రాజకీయంగా కాకాణికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.